వర్షాలతో తెలుగునాట దడ..!
వరద ప్రభావిత ప్రాంతాలపై ఏపీ సీఎం సమీక్ష..
ఎడతెరిపిలేని వర్షాలు, వరదలతో ఏపీ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పడు సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వరద పరిస్థితులపై అధికారులను అడిగి ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. వర్షాలు మరో 24 గంటలపాటు కొనసాగుతాయన్న హెచ్చరికలతో సీఎం చంద్రబాబు…అధికారులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, సహాయక చర్యల్లో నిమగ్నమవ్వాలని ఆదేశాలు జారీచేశారు. వరద ప్రవాహంతో కట్టలు తెగిపడి జనావాసాల్లోకి నీరు చొచ్చుకురావడంతో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. దశాబ్ద చరిత్రలో ఎన్నడూ చూడనంత వర్షపాతం ఇప్పుడు విజయవాడ కేంద్రంగా నమోదు కావడం గమనార్హం. ఏపీ విషయానికి వస్తే గడిచిన 50ఏళ్లలో ఇంతటి వర్షపాతం ఎప్పుడూ నమోదుకాలేదన్నది సీఎం సమీక్షలో అధికారుల వివరణగా తెలుస్తోంది. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా, ఇంకా వరదలు కొనసాగుతున్నాయి. కాగా, వరదనీరు ఉప్పొంగి హైవేలను కప్పేయడంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారుల ఇక్కట్లు అంతా ఇంతా కావు.
చదవండి: పుష్ప 2 నెట్’ఫిక్స్’..?
భారీవర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ అలర్ట్….
తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశనం చేసింది. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు సీఎం రేవంత్. అధికారులెవరు సెలవుల్లో ఉండొద్దని సూచించారు. మరోవైపు అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఏం అవసరం ఉన్నా ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం అందించి సేవలు పొందాలని సూచించారు. కాగా, అధికార యంత్రాంగమే కాదు…పార్టీ శ్రేణులు కూడా సహాయకచర్యల్లో నిమగ్నమవ్వాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణవ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపోస్తుంటే..వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుచోట్ల రాకపోకలు కట్ అయిపోయాయి. రాజధాని హైదారాబాద్లో జనజీవనం స్తంభించిపోగా…పల్లెలు పంటలు నేలకరిచి రైతన్నకు తీవ్రనష్టాన్ని, విషాదాన్ని మిగిల్చాయి.