బాలయ్య స్వర్ణోత్సవం..!
బాలయ్య ఫంక్షన్కు నాగ్ ఎందుకు రాలేదు..?
నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భాన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు స్వర్ణోత్సవ వేడుక నిర్వహించారు. దీనిని హైదరాబాద్లోని నోవాటెల్లో అంగరంగ వైభవంగా నిర్వహించగా ముఖ్యఅతిథిగా చిరంజీవి రావడంతో కార్యక్రమం మరింత హైలెట్ అయింది. మరోవైపు విక్టరీ వెంకటేష్ రాకతో ముగ్గురు మొనగాళ్లుగా వీరు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అయితే నాగార్జున లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే…కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబులాంటి తరం హీరోల తర్వాత…తెలుగు ఇండస్ట్రీలో బలంగా పాతుకుపోయి…ఏ పండగొచ్చినా వాడవాడలా థియేటర్లలో సందడిచేస్తూ అభిమానులతో కేరింతలు వేయించేలా నాడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వచ్చేవి. నువ్వా-నేనా అన్నట్టుగా బరిలో దిగి కలెక్షన్లలో పోటీపడేవి. ఇదంతా 1980, 1990 దశకాల్లో తెలుగు సినీ ప్రస్థానం గురించి తెలిసినవాళ్లని ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇప్పటిలా పూటకో హీరో తెలుగుతెరకు పరిచయమయ్యే రోజులు కావవి. కేవలం ఆ నలుగురు స్టార్స్ మాత్రమే తెలుగురాష్ట్రాలకు తెలుసు. హీరోలంటే వాళ్లే. థియేటర్లు కూడా వాళ్ల రాకకోసమే ఎదురుచూసేవి. చిత్రం వస్తుందని తెలిసి ప్రేక్షకుల కోసం ముస్తాబై రెడీగా ఉండేవి. చిత్రం వచ్చిందా… ఇప్పటిలా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా థియేటర్లలో కొన్నిరోజులైనా ఆడివెళ్లేవి. అసలు తెలుగు సినీ ఇండస్ట్రీ 100 డేస్ పండగను జరుపుకుని ఎన్నాళ్లయింది. బహుశా ఇక ఆ సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సినిమాలు వచ్చాయి అంటే….అది సెంచరీనా, హాఫ్ సెంచరీనా అని లెక్కపెట్టుకునేవాళ్లు. అంటే చూసినవాళ్లు మళ్లీ చూస్తేనే అన్ని రోజులు పడతాయని…అలాంటి అభిమానం కేవలం ఆ నలుగురు హీరోల మాత్రమే సొంతం అన్నది సిని విశ్లేషకుల మాట. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటారా…బాలయ్య స్వర్ణోత్సవ వేడుకకు నాగార్జున కూడా వచ్చిఉంటే నలుగురు హీరోలూ ఒకే ఫ్రేమ్లో కనపడేవారు అన్నది చాలామంది నుంచి వస్తున్నమాట. ఎందుకంటే.. చిరంజీవి, వెంకటేశ్ మాదిరిగానే బాలయ్య ఫంక్షన్కు నాగార్జునకూ ఆహ్వానం వెళ్లింది. అయినా ఎందుకు రాలేదన్న మీమాంస ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. దీంతో ఎవరికివారు తోచినట్టుగా తలోమాట మాట్లాడేసుకుంటున్నారు. ఎన్.కన్వెన్షన్ను హైడ్రా కూల్చేయడంతో నాగార్జున డల్ అయిపోయారని…లేదు,లేదు..బాలయ్య అంటే నాగార్జునకి పిచ్చ లైట్ అని…అందుకే ఫంక్షన్కు రాలేదన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి.
చదవండి: అంతా కుదిరితే వచ్చే ఏడాది పవన్ ఫ్యాన్స్ కు పండగే
బాలయ్య, నాగార్జున మధ్య వైరం..?
నాగార్జున, బాలకృష్ణ మధ్య వైరం ఇప్పటిది కాదని అంటున్నారు వారి గురించి బాగా తెలిసిన వారు. అక్కినేని నాగేశ్వరరావు ఉన్నప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఒకరికొకరికి పిలుపులు ఉంటాయికానీ, ఎవరూ కూడా ప్రోగ్రామ్స్కి హాజరుకాకపోవడమనేది ఏళ్లుగా నడుస్తోందని చెబుతున్నారు. అయితే నాడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేకపోవడంతో ఈ విషయాలు ఎవరికి ఇప్పటివాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చునని తలపండిన పెద్దలు గుర్తుచేస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే కుటుంబ పెద్దలుగా ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు ఏఎన్ఆర్ ఇద్దరూ కాలం చేశారు కాబట్టి…అంతా మరిచి బాలయ్య, నాగ్ స్నేహహస్తం అందుకుని ఇండస్ట్ర్లీలో సహృద్భావ వాతావరణం తీసుకువస్తారని ఆశిస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశారు కింగ్. మొత్తంగా, అన్నీ మరిచిపోయి బాలయ్య 50ఏళ్ల పండుగకు తప్పక వస్తాడని అనుకుంటే రాకపోగా…ఇంకా వారిమధ్య వైరం కంటిన్యూ అవుతుందన్న హింట్ నాగార్జున ఇచ్చినట్టు అయ్యింది.
అబ్బాయిలకు అందని బాబయ్ ఆహ్వానం..!
అన్న హరికృష్ణ కుమారులుగా జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్.. బాలయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ వస్తే చాలు ముఖ్యఅతిథుల్లా బాబయ్ వెంట ఉండేవారు. అలాంటిది వీరిద్దరికి ఇప్పుడేమైందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తప్పు వారిది కాదు, అసలు బాలయ్య ఆహ్వానమే వారికి అందలేదన్నది హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ ఆహ్వానాలు వెళ్లినా కూడా వీరిద్దరికి ఎందుకు పంపలేదు అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. అయితే, వారికి బాలయ్యే అహాన్వాలు పంపొద్దని చెప్పారట. అందుకు కారణం లేకపోలేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మొన్నామధ్య ఎన్నికలు దగ్గరచేసి చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టవడం…జగన్ చర్యను ఖండిస్తూ బాబుకు మద్దతుగా ఇండస్ట్రీనుంచి మాట్లాడిన వారు చాలామంది ఉన్నా…జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్ల నుంచి కనీసం స్పందన లేదు. ఈ విషయంలో చంద్రబాబుకు, టీడీపీ శ్రేణులకి.. వారి పేరు చెబితే మండిపడుతున్నారని టాక్. ఇది గ్రహించిన బాలకృష్ణ…స్టేజ్ పైన చంద్రబాబు ఉంటారు కాబట్టి వారిద్దరికి ఆహ్వానం పంపొద్దని ఆదేశించారట. అందువల్లే వాళ్లు బాలయ్య స్వర్ణోత్సవానికి హాజరుకాలేదన్నది ఇప్పుడొస్తున్న క్లారిటీ. కాగా, ఈ విషయాలన్నీ ముందే తెలిసే అసలు హైదరాబాద్లోనే ఉండకుండా అమ్మతో కలిసి జూ.ఎన్టీఆర్ కర్ణాటక టూర్ పెట్టుకున్నారని తెలుస్తోంది.
ఏంటి ఇలా చేశాడు..?
బన్నీపై బాలయ్య ఆగ్రహం..?
అసలు బన్నీకి ఏమైంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వచ్చిన పుష్ప పాన్ ఇండియా లెవల్లో హిట్ అవ్వడం ఒక ఎత్తైతే…దానికి అదనంగా జాతీయ అవార్డు రావడం మరో అదృష్టం. అంతమాత్రాన చిరు, పవన్తోపాటు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా బన్నీకి చిన్నచూపేనా…అన్న ప్రశ్నలు మొదలైపోయాయి. జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా… బాలయ్య స్వర్ణోత్సవ వేడుకకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిమరీ ఇండస్ట్రీ పెద్దలు ఆహ్వానం ఇచ్చినా…తీరా ఫంక్షన్కు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారట. అయితే, పవన్కల్యాణ్ కూడా ఇదే ఫంక్షన్కు వస్తున్నారన్న సమాచారం తెలిసి బన్నీ రాలేదన్న వార్తలు చక్కర్లకొడుతున్నాయి. ఎందుకంటే…శనివారం సాయంత్రం వరకు ఒకే వేదికపై పవన్, బన్నీ కనిపించబోతున్నారని…వాళ్లు ఒకే వేదిక పంచుకుంటే ఏం జరుగుతుందోనంటూ హైప్ క్రియేట్ చేసిన నేపథ్యంలో బన్నీ సడెన్గా రాకపోవడం ఒకింత షాక్కు గురిచేసింది. ఇదిలాఉంటే, ఇప్పటికీ జగన్ సైడే బన్నీ ఉన్నాడని..అందువల్లే నటుడిగా కాకున్నా ప్రత్యర్థి పార్టీ నేతగా బాలయ్యను చూసి ఆ ఫంక్షన్కు హాజరవ్వలేదన్న ఊహాగానాలూ లేకపోలేదు. ఏదేమైనా తన ఫంక్షన్కు ఆహ్వానం ఇచ్చినా ఓ నటుడిగా బన్నీ రాలేదన్న కోపం బాలయ్యలో ఉందట. చూడాలి మరి, మున్ముందు ఏం జరుగుంతుందో.
బాలయ్యకు చంద్రబాబు శుభాకాంక్షలు..?
బావమరిది, వియ్యంకుడు బాలయ్య కార్యక్రమానికి తానెందుకు హాజరవ్వడం లేదో సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. సినీరంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు. రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో ఉన్నందున…హైదరాబాద్లో జరుగుతున్న నీ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్న బాలయ్య అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రత్యేక అతిథిగా పవన్ వస్తాడనుకుంటే…!
బాలయ్య ఫంక్షన్లోనూ పవన్ కల్యాణ్ కానరాలేదు. ఎన్నికలు దగ్గర చేసి వారిమధ్య ఏర్పడ్డ బాండింగ్ను ప్రతి ప్రచారంలోనూ ప్రజలు చూసిన విషయం విదితమే. ఇరుపార్టీలు ఒక్కటై ప్రభుత్వం స్థాపించగా…రాజకీయ మిత్రుడిగా బాలయ్య స్వర్ణోత్సవానికి పవన్ ప్రత్యేక అతిథిలా కచ్చితంగా వస్తారని అంతా భావించారు. అయితే చంద్రబాబు మాదిరిగానే పవన్ కూడా రాలేదన్న సమాచారం తెలియవస్తోంది. ఇంతటి వరదల వేళ…మంత్రిగా రాష్ట్రప్రజల బాగోగులు చూడాలన్న సదుద్దేశంతోనే ఆయన రాకపోయి ఉండొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అంతేనా, సెప్టెంబర్ 2న బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన OG చిత్రం నుంచి రిలీజ్ అవ్వాల్సిన పోస్టర్ కార్యక్రమాన్ని పవనే ఆపివేయించేశారని, ప్రజలు కష్టాల్లో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని ఆనందంగా ఉండలేనని ఆయన అన్నట్టు సమాచారం. ఇంతటి సున్నిత మనస్కుడు పవన్ …బాలయ్య ఫంక్షన్కు రాకపోవడాన్ని తప్పుగా తీసుకోకుండా, ఆయన చేసింది ముమ్మాటికీ కరెక్టే అంటూ అభినందినందిస్తున్నారట.
బాలయ్యకు దెబ్బేసిన వరుణడు..?
అవును…నిరాటంకంగా కొనసాగుతున్న వర్షాలతో గడిచిన నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాలు వరద విలయంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య స్వర్ణోత్సవానికి రావాల్సిన అతిథులు కూడా అనివార్య కారణాలవల్ల రాలేకపోయారన్నది తెలుస్తోంది. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తే…కష్టకాలంలో ప్రజల వెంట ఉండాల్సిన నేతలు చిద్విలాసంతో ఫొటోలకు ఫోజులివ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి వార్తలు రాజకీయ నాయకులని, ప్రజలు అమితంగా ఆరాధించే నటులకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. సో, పరోక్షంగా బాలయ్యకు రావాల్సిన అతిథులను ముందే వరుణుడు అడ్డుకట్ట వేశాడన్నది చెప్పకతప్పదు. మొత్తానికి బడా బడా నేతలు…పెద్దపెద్ద స్టార్లు బాలయ్యకు గ్రాండ్గా విషెస్ చెబుతారనుకుంటే కార్యక్రమం మొత్తం పేలవంగా సాగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.