తమిళనాట హీరో విజయ్ దళపతి ఆధ్వర్యంలో నెలకొన్న తమిళిగ వెట్రి కళగంకు అధికారిక గుర్తింపు లభించింది. ఎన్నికల కమిషన్ నుంచి ఈ మేరకు ఆమోదం లభించింది. దాదాపు ఏడు నెలల తర్వాత పోల్ ప్యానెల్కు చేసిన అభ్యర్థన ఇన్నాళ్లకు ఫలించినట్లైయింది. కాగా, చెన్నై శివారు పనైయూర్లో గత ఆగస్టులో పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షులు విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించిన విషయం విదితమే. ఇప్పటివరకు మన కోసం మనం శ్రమించాం…ఇకపై తమిళనాడు, తమిళుల ఉన్నతి కోసం సమష్టిగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు విజయ్. 2026 ఎన్నికలే ప్రధాన టార్గెట్గా బరిలోకి దిగబోతోంది విజయ్ పార్టీ తమిళిగ వెట్ర కళగం.
చదవండి: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పడుకునే..!
తమిళనాట ప్రాంతీయ పార్టీలదే హవా..!
దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళులకు వారికి తమ భాషపట్లన్నా, తమ సంస్కృతి అన్నా ఎనలేని అభిమానం. ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాల బోర్డులపై ముందుగా తమిళ భాషే దర్శనమిస్తుందంటే వారికి వారి భాషపట్ల ఎంతప్రేమో అర్థం చేసుకోవచ్చు. ముందునుంచీ ఇలా ఒక్క భాష, వారి సంస్కృతి పట్లే కాదు…రాజకీయాల్లో కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీలకే జైకొట్టి జాతీయ పార్టీల హవాని రాష్ట్రంలో లేకుండా చేశారంటే తమిళ ఓటర్లకి ఓ క్లారిటీ ఉందనే చెప్పాలి.
తమిళనాడులో జాతీయ పార్టీలంటే కేవలం పొత్తులు కుదుర్చుకునే పార్టీలుగానే ముద్రపడ్డాయి. ప్రస్తుత స్టాలిన్ సర్కార్ విషయమే చూసుకుంటే…కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుని డీఎంకే పగ్గాలు చేపట్టింది. ఇక, నాడు జయలలిత మరణాంతరం తెరవెనుక బీజేపీ ఉండి అన్నా డీఎంకే ప్రభుత్వాన్ని నడిపించిన తీరును తమిళ ఓటర్లు పసిగట్టి గత ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం అంటే ఏంటో చూపించారు. వాస్తవానికి జయలలిత మరణాంతరం ఆపార్టీ రెండుముక్కలైందన్న టాక్ ఇప్పటికీ నడుస్తోంది. సో, ఇలాంటి సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం జోరందుకున్నవేళ అనూహ్యంగా ఆయన ఈ రాజకీయాల జోలికి నేను రాను చెప్పడం తమిళనాట మరింత హీట్ రాజేసింది. అదే సమయంలో నటుడు విజయ్ దళపతి పార్టీ పెట్టి… మొన్నా మద్య పార్టీ జెండా ఆవిష్కరించి వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరించడం చూస్తుంటే 2026లో తమిళ పీఠం ఎవరిదో అన్న మీమాంస వెంటాడుతోంది.